అమరావతి : టిడిపి హయాంలో రైతులకు సున్నావడ్డీకి రుణాలే ఇవ్వలేదని ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. 2014లోనే ఈ పథకాన్ని నిలిపివేసిన టిడిపి ప్రభుత్వం.. రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వబోమని చెప్పిందని వ్యాఖ్యానించారు. ఈరోజు ఎపి అసెంబ్లీలో కరవుపై చర్చ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ..‘అధ్యక్షా.. ఈరోజు చంద్రబాబు నాయుడుగారికి ఇక్కడే సవాల్ విసురుతున్నా.
2014 నుంచి 2019 దాకా రైతులకు సున్నా వడ్డీ కింద ఎంత రుణాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.. ఎస్.. చెప్పండి. నోరు తెరిస్తే అబద్ధాలే. అధ్యక్షా.. కావాలంటే నేను రికార్డులు తెప్పిస్తా. ఆ రికార్డులు తెచ్చి చూపించిన తర్వాత ఆ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతారా? అని అడగండి అధ్యక్షా. రెడీనా.. నేను ఇప్పుడే అసెంబ్లీలోకి రికార్డులు తెప్పిస్తా’ అని మండిపడ్డారు. ఈ సందర్భంగా వైసిపి సభ్యులు గట్టిగా అరిచారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.